శునకం ఏ మూడ్లో ఉందో చెప్పేస్తోంది
మనుషులకు శునకాలు ప్రియనేస్తాలు. మనం ఎంత ఒత్తిడిలో ఉన్నా వాటితో కాసేపు సమయం గడిపితే ప్రశాంతంగా ఉంటుంది. శునకాల మనసును అర్థం చేసుకోవడం మాత్రం ఎంత ఇష్టంగా పెంచుకునే యజమానికైనా కష్టమే. ఇందుకు ఓ సంస్థ వినూత్న డివైజ్ను రూపొందించింది. దీంతో శునకం ఎలాంటి మూడ్లో ఉందో టక్కున చెప్పొచ్చట. జపాన్కి చెందిన ‘ఇనుపతి’ అనే సంస్థ సరికొత్త డివైజ్ను తయారు చేసింది. శునకం మెడకు కట్టే బెల్టు స్థానంలో ఈ డివైజ్ను అమర్చాలి. ఇది శునకం గుండె చప్పుడును.. కండరాల కదలికలను పరీక్షించి ఆ సమాచారాన్ని యజమాని మొబైల్లోని యాప్కి పంపిస్తుంది. డివైజ్ నుంచి వచ్చే రంగు లైట్ల ద్వారా శునకం ఏ మూడ్లో ఉందో తెలుసుకోవచ్చట. శునకం కోపంగా ఉన్నట్లయితే ఎరుపు రంగు.. ప్రశాంతంగా ఉంటే నీలిరంగు.. శ్రద్ధగా ఉన్నట్లయితే తెలుపు రంగు.. సంతోషంగా ఉంటే ఇంద్రధనస్సులోని ఏడు రంగులతో కూడిన లైట్ వెలుగుతుంది. ఇనుపతి సంస్థ సీఈవో జోజి యుమగుచికి.. తన పెంపుడు శునకం తనని బాగా అర్థం చేసుకుంటుందట. కానీ.. అతనికే శునకం గురించి తెలియక... దానికి మరింత దగ్గర అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ డివైజ్ను రూపొందించాడట. మంచి ఫలితాలు రావడంతో ఈ డివైజ్ను డిసెంబరులో మార్కెట్లోకి తీసుకురానున్నారు.
No comments: