కాశీకి వెళ్లి సమాధి అవుతానని... రాసలీలు నడిపిన సినీ నిర్మాత
చెన్నై: కాశీకి వెళ్లి సమాధి అవుతానంటూ లేఖ రాసిపెట్టి మాయమైన వేందర్ మూవీస్ మదన్ అజ్ఞాతంలో సకల భోగాలను అనుభవిస్తూ ఉల్లాసవంతమైన జీవితాన్ని గడిపాడు. గత మే నెలలో పరారైనప్పటి నుంచి మదన్ తన ప్రియురాళ్లతోనూ, అందమైన యువతులతోనే సంబంధాలు పెట్టుకుని హరిద్వార్, గోవా తదితర నగరాలకు వారిని వెంటబెట్టుకునే తిరగాడు. ఈ వివరాలన్నీ క్రైం పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మదన్కు ఇద్దరు భార్యలున్నారు. ఎస్సారెమ్ యూనివర్శిటీ మెడిసిన్ సీట్లిప్పిస్తానంటూ విద్యార్థుల నుంచి వసూలు చేసిన సుమారు రూ.84 కోట్లతో పరారయ్యేందుకు సిద్దమై రెండోభార్యకు వడపళనిలో ఓ ప్లాటును, మొదటి భార్యకు కేరళలో ఓ ఇంటిని కొనిచ్చాడు. ఇక వేందర్ మూవీస్ అధినేతగా ఉన్నప్పుడు మదన్ వద్దకు సినిమా ఛాన్సుల కోసం అతడి చుట్టూ తిరిగిన వర్ష అనే యువతిని తన బుట్టలో వేసుకున్నాడు. ఆ తర్వాత గీతాంజలి, మెర్సియా సహా పలువురు అమ్మాయిలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గీతాంజలితోనే ఆయన తన అజ్ఞాతవాసాన్ని హరిద్వార్ నుంచి ప్రారంభించాడు. గీతాంజలి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలియగానే ఆమెను వెనక్కి పంపాడు. ఆ తర్వాత రెండు నెలలపాటు గోవా, బెంగుళూరు, కల్కత్తా తదితర ప్రాంతాల్లో సంచరించాడు. రూ.60 లక్షలతో లగ్జరీ కారు కొన్నాడు. 10 ఎకరాల ఫామ్హౌస్ కొన్నాడు. పూనాలో కొంతకాలం గడిపిన తర్వాత తిరుప్పూరులో దాగి ఉండాలని మదన నిర్ణయించాడు. అప్పటికే తిరుప్పూరుకు చెందిన వర్ష అనే వితంతువుతో మదనకు రెండేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. కనుకనే ఆయన తిరుప్పూరులో దీపావళినాడు వర్షతోపాటు బంగళాలో రహస్యంగా కాపురం పెట్టాడు. ఆ బంగళాలో ఉన్నప్పుడు మదన నైటీ వేసుకుని ఆడదానిలా సంచరించేవాడు. గీతాంజలి బంధువైన శేఖర్ వద్ద పోలీసులు జరిపిన విచారణ వల్ల మదన దాగిన చోటును తెలుసుకోగలిగారు. ప్రస్తుతం జైలులోఉన్న మదనను పది రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారణ జరపాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
No comments: