pop

అమెరికాలో తెలుగు ‘పిలుపు’


అమెరికాలోని తెలుగువారిని ఏడాదిన్నర క్రితం ఆప్యాయంగా పలకరించిన ‘పిలుపు’ టీవీ ప్రవాసీయులకు మరింత చేరువకానుంది. విభిన్నమైన కారక్రమాలతో ప్రవాసీయుల మన్ననలను అందుకుంటున్న ఈ చానల్‌ ఇప్పుడు ‘పిలుపు టీవీ డాట్‌ కామ్‌’ ద్వారా పూర్తిస్థాయి ప్రసారాలతో అందరికీ అందుబాటులోకి వచ్చింది. మెదక్‌ జిల్లా సిద్దిపేటకు చెందిన నక్షత్రం వేణు, ఆయన భార్య అవంతిక దంపతుల ఆధ్వర్యంలో కేవలం రూ.4 లక్షల పెట్టుబడితో గత ఏడాది జనవరి 10న పిలుపు టీవీ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. చానల్‌ సీఈవో వేణు... సామాజిక సందేశాలతో కూడిన పలు లఘు చిత్రాలు నిర్మించి అందరికీ సుపరిచితులయ్యారు. అవంతికకు కెమెరా, ఎడిటింగ్‌ రంగంలో పదేళ్లకు పైగా అనుభవముంది. ప్రముఖ ఎన్‌ఆర్‌ఐ గాయకుడు, రేడియో జాకీగా విశేష అనుభవం ఉన్న పేటూరి గోపీనాథ్‌, కెమెరా, ఎడిటింగ్‌లో నిష్ణాతుడైన సాయిరాం పల్లిల నిర్విరామ కృషితో పిలుపు టీవీ కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. వేణు, అవంతికతో పాటు మరో 25 మంది సభ్యులు చానెల్‌ అభివృద్ధి కోసం స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువమంది ఐటీ నిపుణులే. తెలంగాణలోని సిద్దిపేటతో పాటు హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కావలి, తిరుపతి, విజయవాడ, గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, పాలకొల్లు, వైజాగ్‌, గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాలకు చెందినవారు ఈ బృందంలో ఉన్నారు. వీరంతా వేతనం ఆశించకుండా అహరహం ఈ చానల్‌ అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారు.
తొలుత ఒక గంట నిడివితో మొదలైన ఈ చానల్‌ ప్రసారాలు వాషింగ్టన్‌ డీసీకే పరిమితమయ్యాయి. గత దీపావళి వరకు అమెరికన్‌ నెట్‌వర్క్‌ ద్వారా నాలుగు గంటలపాటు కొనసాగాయి. అమెరికాలోని దేవాలయాలు, అక్కడ జరిగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, సమ్మేళనాలు, భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ప్రసారాలను అందిస్తున్నారు. ‘కళలే అలలై’ కార్యక్రమం ద్వారా ప్రవాసీయులకు తెలుగు సాహిత్య గుబాళింపులను పరిచయం చేస్తున్నారు. సినీ ప్రియుల కోసం మూవీ ముచ్చట్లు, చిన్నారుల కోసం బుడుగులు-పిడుగులు కార్యక్రమాలనూ అందిస్తున్నారు. ప్రవాసులకు అమెరికాలోని చట్టాలు మొదలైన వాటిపైనా తమ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది. వీటిలో నెలల తరబడి మంచు కురిసే ప్రాంతాలున్నాయి. ఈ వాతావరణంలో సీజనల్‌ వ్యాధుల రక్షణకు ప్రవాసీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. పిలుపు వెబ్‌చానల్‌ ప్రసారాలతో తెలుగు రాని పిల్లలు కూడా ఇంగ్లీషులో రాసుకొని తెలుగు పాటలు నేర్చుకుంటుండటం విశేషం. త్వరలో అమెరికాలోని ఇతర రాష్ట్రాల్లో గల తెలుగువారి నైపుణ్యాన్ని, ప్రతిభను వెలుగులోకి తెచ్చేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. పిలుపు టీవీ డాట్‌ కామ్‌ వెబ్‌సైట్‌లో ఈ ప్రసారాలు చూడవచ్చు. ఇప్పటివరకు రికార్డింగ్‌ కార్యక్రమాలనే ప్రసారం చేస్తుండగా, భవిష్యత్తులో ఆన్‌లైన్‌ ప్రసారాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

No comments:

Powered by Blogger.