రిలయన్స్ జియో మరో సంచలన ప్రకటన!
అతి తక్కువ ధరకే డేటా ప్యాక్స్ను అందిస్తామని ప్రకటించి, వాయిస్ కాల్స్ అన్నీ ఫ్రీ అనే ఒకేఒక్క ప్రకటనతో టెలికామ్ కంపెనీలకు షాకిచ్చిన జియో మరో సంచలనానికి తెరలేపబోతుందని టెక్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. జియో ఫ్రీ కాలింగ్ ఆఫర్తో సామాన్యులను టార్గెట్ చేసిన ముఖేష్ అంబానీ ఈసారి మధ్యతరగతి వర్గాలను కూడా ఆకట్టుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయం మొబైల్ వినియోగదారులకు సంబంధించినది కాదు. డీటీహెచ్ రంగంలోకి రిలయన్స్ జియో అడుగుపెట్టబోతోంది. ఆరంభంతోనే ఇతర డీటీహెచ్ కంపెనీలను కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు ప్రణాళిక సిద్ధమైంది. దేశంలో ఏ డీటీహెచ్ సర్వీస్ ఆపరేటర్ ప్రకటించనంత తక్కువగా జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించనుంది. ఇతర కంపెనీలు 275 నుంచి 300 రూపాయలకు అందించే నెలవారీ డీటీహెచ్ ప్యాక్ను ముఖేష్ అంబానీ 185 రూపాయలకే అందించాలని భావిస్తున్నారట. ఇది ఎయిర్టెల్కు భారీ నష్టాన్ని మిగిల్చే అవకాశముందని టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదేగానీ జరిగితే డీటీహెచ్ రంగంలో రిలయన్స్ జియో హవా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎయిర్టెల్, టాటా స్కై, డిష్ టీవీ యాజమాన్యాలను ఈ నిర్ణయం కోలుకోలేని దెబ్బ తీస్తుంది. అయితే ఈ రిలయన్స్ జియో డీటీహెచ్ సర్వీస్కు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే టెలికామ్ రంగంలోనే రిలయన్స్ జియో నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ పోరాడుతున్న ఎయిర్టెల్ ఈ ప్రకటన వెలువడితే తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించింది. జియో ఆఫర్లకు అడ్డుకట్ట వేయకపోతే మనుగడకే ప్రమాదం కలుగుతుందని ఇతర కంపెనీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి.
No comments: