pop

ఆడ పిల్లలను అమ్మేస్తున్నారు


Related imageనిరుపేద కుటుంబాలకు చెందిన ఆడ పిల్లలే లక్ష్యంగా ఓ ముఠా చెలరేగిపోతోంది. కాకినాడలోని దుమ్ములపేట ప్రాంతంలో మత్స్యకార కుటుంబాలకు చెందిన బాలికలకు హైదరాబాద్‌లో పని చూపుతామని నమ్మించి తీసుకెళ్తున్న కొందరు దళారులు వారిని వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారు. మోసపోయిన ఓ బాధితురాలు సోమవారం ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడుతూ పని ఇప్పించకపోవడంపై తాను ప్రశ్నించగా ఒక అపార్టుమెంట్‌ గదిలో ఉంచి తిండి లేకుండా మూడురోజులు ఉంచారని, ఆ పని చేస్తే రోజుకు రూ.20,000లకు పైగా సంపాదించవచ్చని ఒత్తిడి చేశారని, తాను వ్యతిరేకించడంతో కొట్టారని వివరిస్తూ విలపించింది. వాచ్‌మేన్‌ సహకారంతో తమ తల్లిదండ్రులకు ఫోన్‌చేసి కాకినాడకు చేరుకున్నానని, తనతో పాటు మరికొందరు అమ్మాయిలు అక్కడే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే న్యాయం చేయలేదని పేర్కొంది. దుమ్ములపేటకే చెందిన నూకరత్నం మాయమాటలు చెప్పి ఆడపిల్లలను వ్యభిచార గృహాలకు తరలిస్తున్నారని ఆమె తెలిపింది. ఈ విషయంపై దుమ్ములపేటకు చెందిన రమేష్‌ అనే వ్యక్తి ‘ఈనాడు’తో మాట్లాడుతూ ఇప్పటి వరకు 40 మందిని దుమ్ములపేట నుంచి హైదరాబాద్‌, బెంగళూరుకు తరలించారని చెప్పారు. దీనిపై ఈనెల 18న దుమ్ములపేట వచ్చిన కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నూకరత్నం కుమారుడు ఫొటోగ్రఫీ పేరుతో అమ్మాయిలను తన వెంట తీసుకెళ్లి ప్రేమిస్తున్నట్లు నటించి వారిని వ్యభిచార గృహాలకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఓ బాధితురాలు మాట్లాడుతూ ప్రేమ పేరుతో వివాహం చేసుకుని అమ్మాయి పుట్టాక అతను తనను వదిలేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. నూకరత్నంపై వచ్చిన ఫిర్యాదుతో ప్రత్యేక బృందాన్ని సోమవారం హైదరాబాద్‌కు పంపామని కాకినాడ డీఎస్పీ సూర్యదేవర వెంకటేశ్వరరావు తెలిపారు. తమతో వ్యభిచారం చేయిస్తున్నారని బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేస్తున్నామన్నారు. బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

No comments:

Powered by Blogger.