pop

28న భారత్ బంద్‌!


నోట్ల రద్దుపై విపక్షాలు పోరును ఉధృతం చేశాయి. ఈ నెల 28న భారత బంద్‌కు పిలుపునిచ్చాయి. పార్లమెంటు సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద బుధవారం 13 విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్‌, తృణమూల్‌, ఎస్పీ, బీఎస్పీ, జేడీయూ, డీఎంకే, వామపక్షాలు, తదితర పార్టీలకు చెందిన 200 మందికిపైగా ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ఏటీఎంల వద్ద క్యూలో నిల్చున్నట్లు పార్లమెంటు ప్రవేశద్వారం నుంచి ఎంపీలు వరుసగా నిల్చుని నిరసన తెలిపారు. ప్రధాని పార్లమెంటుకు వచ్చి రద్దుపై దేశ ప్రజలకు సమాధానం ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దును ప్రపంచంలోనే అతిపెద్ద ప్రణాళికారహిత ఆర్థిక ప్రయోగంగా అభివర్ణించారు. ఆర్థికరంగ నిపుణులను సంప్రదించకుండా.. ఆర్థిక మంత్రికి తెలియకుండా ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారని రాహుల్‌ ధ్వజమెత్తారు. బీజేపీ సన్నిహితులైన పారిశ్రామికవేత్తలకు రద్దు నిర్ణయం ముందుగానే లీకయిందన్నారు. రద్దు నిర్ణయం వెనుక భారీ కుంభకోణం ఉందని, దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ‘పాప్‌ సంగీత కచేరీల్లో ప్రధాని ఉపన్యాసాలు చేస్తారు. కానీ పార్లమెంటులో 200 మందికిపైగా ఎంపీలు రద్దు నిర్ణయంపై లేవనెత్తుతున్న సందేహాలను నివృత్తి చేసేందుకు ఆయనకు నోరు పెగలదు’ అని రాహుల్‌ ఎద్దేవా చేశారు. పార్లమెంటు అంటే ప్రధాని ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. రద్దు నిర్ణయంతో సాఫీగా సాగుతున్న దేశ ఆర్థికవ్యవస్థ భారీ కుదుపునకు గురైందని విమర్శించారు. రైతులు, మత్స్యకారులు, సాధారణ కూలీలు అందరిపైనా రద్దు నిర్ణయం దారుణంగా ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద బడాబాబులు కానీ, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా క్యూలో నిల్చున్న దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. క్యూలో నిల్చుని ప్రాణాలు కోల్పోయిన సామాన్యులకు పార్లమెంటు నివాళి అర్పించాలని డిమాండ్‌ చేశారు. విపక్షాల ఆందోళనకు ఎవరు నేతృత్వం వహిస్తున్నారన్న ప్రశ్నకు రాహుల్‌ స్పందిస్తూ.. రద్దుతో బాధపడుతున్న పేద ప్రజలు నేతృత్వం వహిస్తున్నారని సమాధానమిచ్చారు. కాగా, రద్దుపై విపక్షాల ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వని పక్షంలో రాష్ట్రపతిని కలవాలని భావిస్తున్నట్లు సీపీఐ నేత డి.రాజా తెలిపారు. ఈ నెల 28న దేశవ్యాప్తంగా ఆక్రోశ్‌ దివస్‌ పేరిట ఆందోళనలు చేస్తామని సీపీఎం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా నిర్వహించారు. జేడీయూ, ఎస్పీ, ఎన్సీపీ, ఆప్‌ నేతలు మమతకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. ప్రధాని మోదీ చేతిలో దేశానికి భద్రత లేదని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారని, వారి హక్కులను బలవంతంగా లాగేసుకున్నారని దుయ్యబట్టారు. అన్ని వర్గాల ప్రజలపై రద్దు ప్రభావం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్విస్‌ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న వారిని వదిలేసి సామాన్యులను ఎందుకు వేధిస్తున్నారని నిలదీశారు. ప్రజలు మోదీ సర్కార్‌కు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రద్దు నిర్ణయాన్ని నల్లచట్టంగా అభివర్ణించారు. జేడీయూ నేత శరద్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. రద్దు నిర్ణయానికి చట్టబద్ధత లేదన్నారు.

No comments:

Powered by Blogger.