దుర్మార్గాలు బయటపడుతున్నాయి
దిల్లీ: వివాదాస్పద ఇస్లామిక్ మత బోధకుడు, జకీర్ నాయక్కు జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) ఝలక్ ఇచ్చింది. జకీర్, అతని ఇస్లామిక్ రీసెర్చి ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్)కు సంబంధించిన బ్యాంకు ఖాతాలన్నింటినీ స్తంభింపజేయాలని ఎన్ఐఏ అధికారులు బ్యాంకులను కోరారు. జకీర్ నేతృత్వంలోని ఇస్లామిక్ రీసెర్చి ఫౌండేష్ను కొన్నేళ్లపాటు కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నెల 19నుంచి మూడు రోజులపాటు ముంబయిలో 20చోట్ల తనిఖీలు చేపట్టిన ఎన్ఐఏ.. జకీర్, ఐఆర్ఎఫ్కు చెందిన బ్యాంకు ఖాతాల లావాదేవీలన్నింటినీ స్తంభింపజేయాలని బ్యాంకులను కోరింది. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నాయక్, ఐఆర్ఎఫ్, గుర్తుతెలియని కొందరు ఆఫీసు బేరర్లపై ఎన్ఐఏ కేసులు నమోదుచేసింది. మూడు రోజులపాటు సుమారు 20 చోట్ల సోదాలు కొనసాగించిన అధికారులు నాయక్, ఐఆర్ఎఫ్ బ్యాంకు ఖాతాలు, ఇతర ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన దస్త్రాలను, వీడియో టేపులు, జకీర్ ప్రసంగాల డీవీడీలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాద వ్యతిరేక విభాగ సమాచారం ప్రకారం.. ఐసిస్లో చేరిన అబూఅనాస్కు 2015లో రూ.80,000 ఐఆర్ఎఫ్ నుంచి స్కాలర్షిప్గా ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. రాజస్థాన్లోని టోంక్కు చెందిన అనాస్ గతంలో హైదరాబాద్కు చెందిన ఓ కంపెనీలో ఇంజినీర్గా పనిచేశాడు. రిపబ్లిక్డే వేడుకల్లో దాడులు జరపాలని కుట్రపన్నిన కేసులో అతన్ని జనవరిలోనే పోలీసులు అరెస్టుచేశారు. ఐఆర్ఎఫ్కు సంబంధించిన వెబ్సైట్లు, వీడియో ప్రసంగాలు వంటి ఆన్లైన్ కార్యకలాపాలను సైతం నిషేధించాలని కోరుతూ ఎన్ఐఏ కేంద్ర హోం మంత్రిత్వశాఖకు లేఖ రాసినట్లు సమాచారం.
No comments: