సోషల్ మీడియా అకౌంట్ల హ్యాకింగ్
హ్యాకింగ్ ఎందుకు చేస్తారంటే.. డాటాను తస్కరించడం.. మహా అయితే బ్లాక్మెయిల్ చేయడానికని అందరికీ తెలుసు. కానీ.. నగరంలో కొంతమంది సరదా కోసం హ్యాకింగ్ చేస్తున్నారు. భావి ఇంజనీర్లు కాలక్షేపం కోసం హ్యాకర్ల అవతారం ఎత్తుతున్నారు. తాజాగా.. దిల్సుఖ్ నగర్లో ఓ వ్యక్తి యువతి ఫేస్బుక్ ఖాతాను హ్యాక్ చేశాడు. ఏదో ఘనకార్యం చేసినట్టు ఖాతా ఐడీ, పాస్వర్డ్ను ఆమె వాట్సప్ నెంబర్కు మేసేజ్ చేశాడు. రెండు రోజుల క్రితం రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగిందీ ఘటన. ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ సిటీ: ఇంజనీరింగ్ పూర్తిచేసిన విక్రాంతరెడ్డిది దిల్సుఖ్నగర్. చిన్నప్పటినుంచి చదువులో ఫస్ట్. ప్రస్తుతం సాఫ్ట్వేర్ కొలువు వేటలో ఉన్నాడు. అందుకోసం శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. ఖాళీ సమయంలో సోషల్ మీడియాలో గడుపుతుంటాడు. స్నేహితుల ట్విటర్, ఫేస్బుక్ ఖాతాలను ఓపెన్ చేసి చూడటమంటే అతడికి మహా సరదా. ఫిషింగ్ మెయిల్ పంపించి సోషల్ మీడియా అకౌంట్లను సులువుగా హ్యాక్ చేయొచ్చని తెలుసుకున్నాడు. సరదాగా స్నేహితుల అకౌంట్లను హ్యాక్ చేసేవాడు. తర్వాత వారి వ్యక్తిగత వాట్సప్ నెంబర్లకు ఐడీ, పాస్వర్డ్ పంపించి స్నేహితులను ఆటపట్టించేవాడు. స్నేహితుల అకౌంట్లను హ్యాక్ చేస్తే కిక్కేముందనుకున్నాడో ఏమో.. వారి అకౌంట్లమీద కన్నేశాడు. మొదట ఫేస్బుక్ ఖాతాలను హ్యాక్ చేసి.. వాటి ద్వారా యువతుల అకౌంట్ల పాస్వర్డ్లను తస్కరించేవాడు. సరూర్నగర్కు చెందిన ఓ యువతి ఫిర్యాదుతో విక్రాంతరెడ్డి భండారం బయటపడింది. ఓ రోజు ఆమె వ్యక్తిగత నెంబర్కు ఫేస్బుక్ ఐడీ, పాస్వర్డ్ సందేశం వచ్చింది. అది చూసి ఆమె అవాక్కయింది. తన ఫేస్బుక్ ఖాతాను హ్యాక్ చేసినట్టు గుర్తించింది. స్నేహితుల సహాయంతో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విక్రాంతరెడ్డిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించగా.. సరదా కోసమే హ్యాకింగ్ చేసినట్టు అంగీకరించాడు. కేసు నమోదు చేయడానికి సిద్ధమవగా.. తల్లిదండ్రులు, స్నేహితులు కాళ్లబేరానికి వచ్చారు. అతడి భవిష్యత దెబ్బతింటుందన్నారు. విక్రాంతరెడ్డి సెల్ఫోన్లు, ల్యాప్టాప్ను పోలీసులు పరిశీలించగా.. నేరాలు చేయలేదని తేలింది. యువతి ఫిర్యాదును వెనక్కి తీసుకోవటానికి అంగీక రించడంతో అతడిని మందలించి విడిచిపెట్టారు. హ్యాకింగ్ చేయడం నేరం హ్యాకింగ్ చేయడం చట్టప్రకారం నేరం. సరదా.. లేదా కాలక్షేపం కోసం చేసినా శిక్ష అనుభవించాల్సిందే. ప్రస్తుతం హ్యాకర్లు డాటాను తస్కరించి బ్లాక్మెయిల్ చేసి వేధిస్తున్నారు. కొంతమంది ఫిషింగ్ మెయిల్ పంపించి.. వారి స్నేహితుల ఖాతాలను హ్యాక్ చేసి ఆట పట్టిస్తున్నారు. సరదా కోసం చేసే ఈ తంతు బ్లాక్మెయిల్కు దారితీసే అవకాశం ఉంది. నెటిజన్లు ఫిషింగ్ మెయిళ్లపట్ల అప్రమత్తంగా ఉండాలి. నెట్ వినియోగిస్తున్నప్పుడు అడ్రస్ బార్ను తరచూ చెక్ చేసుకోవాలి.అన్ని మెయిళ్లకు స్పందించొద్దు. ముఖ్యంగా.. ఖాతాలను ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసు కోవాలి. యాంటీ వైరస్ను కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి.
No comments: