చిన్నారి ప్రాణం నిలపండి..
గుంటూరు, ముప్పాళ్ళ: మండలంలోని మాదలలో ఏడేళ్ల బాలు డు ఓసూరి వేణుకు సొరియాసిస్, బోన్స్ వీక్ (కాల్షియంలోపం) వ్యాధులు సోకి ప్రాణాపాయం గా ఉందని తల్లిదండ్రులు లక్ష్మీ, శ్రీనివాసరావులు తెలిపారు. బతుకు తెరువు కోసం ప్రకాశం జిల్లా సజ్జాపురం నుంచి ఏడేళ్ల కిందట మాదల వచ్చామని తెలిపారు. పెద్ద కుమారుడు వేణుకు పుట్టుకతోనే సోరియాసిస్, బోన్స్ వీక్ వ్యాఽధులు సోకాయని తెలిపారు. వేణు నడిచేటప్పుడు కింద పడిపోతే ఎముకలు వెంటనే విరిగిపోతాయన్నారు. చర్మంపై పొట్టు లేచి ఎండ వేడిమి తట్టుకోలేడన్నారు. రాత్రి వేళల్లో కూడా ఒళ్ళు మంటలతో ఏడుస్తూ కూర్చునే వాడని తెలిపారు. గుంటూరు, నరసరావుపేట, నెల్లూరులోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయించామని తెలిపారు. తమకున్న స్థలాన్ని అమ్మి ఇప్పటివరకు రూ.5 లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించామన్నారు. ప్రస్తుతం ఆయుర్వేద వైద్యం చేయిస్తున్నామని, వ్యాధి నయమవుతోందని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో మూడు నెలలుగా మందులను కొనుగోలు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మరో మూడేళ్లు మందులు వాడితే వ్యాధి నయం అవుతుందని వైద్యులు చెప్పారని తెలిపారు. ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. నెలవారీ మందులకు రూ.7 వేలు, ఎముకల బలం కోసం రోజూ కోడిగుడ్డు, మాంసాహారం, పాలు, ఆకుకూరలు ఇచ్చేందుకు రూ.5 వేలు ఖర్చు అవుతోందని తెలిపారు. తాపీ పని చేసుకుని బతికే తమకు ఈ ఖర్చు భారమైందని ఆవేదన వ్యక్తం చేశారు. బాబు వైద్యం కోసమే రూ.లక్షకు పైగా అప్పు చేశామన్నారు. దాతలు ముందుకు వచ్చి తమ బిడ్డకు ప్రాణదానం చేయాలని వేడుకుంటున్నారు. నరసరావుపేట ఆంధ్రాబ్యాంకు అకౌంట్ నెంబర్ 038110100068481ను ఉపయోగించి సాయం చేయాలని కోరారు. వివరాలకు 7095058903 నంబర్ను సంప్రదించాలని తెలిపారు.
No comments: