యువకుడి కడుపులో శిశువు పిండం
యువకుడి కడుపులో ఆశ్చర్యకరంగా శిశువు పిండం బయటపడింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి దాన్ని తొలగించారు. బాలాసోర్ జిల్లా జలేశ్వర్ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల యువకుడికి ఇటీవల పొత్తికడుపు పెరగడం మొదలైంది. నొప్పి వచ్చింది. దీంతో వైద్యులు అతడిని పరీక్షించి కడుపులోకణితి (ట్యూమర్) ఉన్నట్లు గుర్తించారు. ఆరుగురు వైద్యులతో కూడిన బృందం 10 రోజుల కిందట శస్త్రచికిత్స చేసి దాన్ని బయటకు తీసింది. ఆ కణితికి కాళ్లు, చేతులు వంటి ఆకారాలు, శరీరంపై రోమాలు ఉండడంతో దానిని అధ్యయనం చేశామని ఎయిమ్స్ ఆసుపత్రి శస్త్రచికిత్సల విభాగం వైద్యుడు తుషార్ సుభదర్శన్ మిశ్ర తెలిపారు. దీంతో అది పిండంగా నిర్ధరణ అయిందన్నారు. జన్యుపరమైన కారణాల వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతాయని ఆయన వివరించారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కవలలు ఏర్పడే క్రమంలో ఒక్కోసారి ఒక పిండం కడుపులో మరో పిండం ఉండిపోతుందని, దీన్ని వైద్య పరిభాషలో ‘పిట్స్ ఇన్ పిటు’ అని అంటారని తుషార్ వివరించారు. ఇదీ అలా జరిగి ఉండవచ్చన్నారు. శస్త్రచికిత్స అనంతరం యువకుడు కోలుకుని ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయాడన్నారు.
No comments: