రూ. 500 నోట్లతో కారెక్కాడు ఓ ప్రయాణికుడు.. అప్పుడేమైందంటే
పెద్ద నోట్ల రద్దుతో ప్రజల ఇబ్బందులు ఇన్నీ అన్నీ కావు. అందునా.. ప్రధాని ఆ ప్రకటన చేసిన మంగళవారం రాత్రి అయితే జేబులో రూ.500 నోట్లతో ప్రయాణాలకు సిద్ధమైన చాలా మంది క్యాబ్లకు చెల్లింపులు చేయలేక చాలా ఇబ్బంది పడ్డారు. అటు డ్రైవర్లకూ ఇబ్బంది.. ఇటు వినియోగదారులకూ ఇబ్బంది. ఢిల్లీలో అలాంటి ఘటనే ఒకటి జరిగింది. కానీ.. డ్రైవర్ పెద్ద మనసుతో వ్యవహరించడమే విశేషమై సోషల్మీడియాకు ఎక్కింది. అసలేం జరిగిందంటే.. ఢిల్లీకి చెందిన విప్లవ్ అరోరా అనే ఆయన మంగళవారం రాత్రి ఓలా క్యాబ్లో రైల్వే స్టేషన్కు బయల్దేరారు. జేబులో అన్నీ 500 నోట్లే ఉన్నా తన ‘ఓలా అకౌంట్’లో డబ్బు ఉందన్న ధీమాతో ఆయన క్యాబ్ బుక్ చేసుకున్నారు. తీరా స్టేషన్కు వెళ్లే సరికి ఆయన ఖాతాలో ఉన్న డబ్బు కన్నా మీటర్ ధర ఎక్కువైనట్టు తేలింది. ఇద్దామంటే జేబులో ఉన్నవన్నీ 500 నోట్లే. అప్పుడా క్యాబ్ డ్రైవర్ విపిన్ కుమార్.. ‘పోన్లెండి సార్.. ఇలాంటి ఇబ్బందులు అందరికీ వస్తుంటాయి. అయినా ప్రభుత్వం ఒక మంచి పని చేసింది. ఆ నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను. ఆ సొమ్ము దేశ సంక్షేమానికి నా వంతు సహాయం అనుకుంటాను. మీ రైలుకు టైమ్ అయిపోతోంది. లోపలికి వెళ్లండి. బాధపడొద్దు’ అన్నాడట. అంతే విప్లవ్ అరోరా చలించిపోయారు. డ్రైవర్ విపిన్కుమార్ మంచితనాన్ని మెచ్చుకుంటూ ఓలా ఫేస్బుక్ పేజీలో ఒక పోస్ట్ పెట్టారు. దీంతో, ఓలా కంపెనీ కూడా స్పందించి.. విపిన్ వంటి డ్రైవర్ తమతో కలిసి పనిచేయడం తమకు గర్వకారణమని పేర్కొంది. ఆరోజు విపిన్కు విప్లవ్ అరోరా చెల్లించాల్సిన మిగతా చార్జీని తాను చెల్లిస్తానని ప్రకటించింది. ఈ పోస్ట్.. విపిన్ మంచితనం.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
No comments: