సెల్ఫీ మృతుల్లో భారత్ టాప్.. పాకిస్థాన్ సెకండ్... అమెరికా థర్డ్
టెక్నాలజీ అభివృద్ది చెందిన తర్వాత ప్రపంచం ఓ కుగ్రామంలా మారిపోయింది. నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తి జీవితంలో సెల్ఫోన్ ఓ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. వీటితోనే ప్రతి పనిని చక్కదిద్దుతున్నారు. ఇంటర్నెట్, సోషల్ మీడియా, మొబైల్ ఫోన్.. ఏదైనా సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటేనే ప్రయోజనం ఉంటుందని, వాటికి బానిసలుగా మారినా, దుర్వినియోగం చేసినా దుష్పరిణామాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు సెల్ఫీ మరణాలే మంచి ఉదాహరణ. తాజ్ మహల్ లేదా ఏ చారిత్రక కట్టడం ముందో దర్జాగా సెల్ఫీ తీసుకోవచ్చు. అయితే రన్నింగ్ ట్రైన్ ముందు, గన్తో పోజులిస్తూ, కొండ అంచున నుంచుని సెల్ఫీ తీసుకోవాలనుకుంటే ప్రమాదం తప్పకపోవచ్చు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు దక్కవు. ఇలా ప్రయత్నించి మరణించిన వారు చాలా మంది ఉన్నారు. విషాదం ఏంటంటే సెల్ఫీ మరణాల్లో భారత్ ప్రథమ స్థానంలో ఉంది. పొరుగుదేశం పాకిస్థాన్ తర్వాతి స్థానంలో ఉంది. అమెరికాకు చెందిన కార్నెగీ మెలాన్ యూనివర్శిటీ, ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెల్ఫీ మరణాలపై అధ్యయనం చేశాయి. 2014 మార్చి నుంచి ఇప్పటివరకు 127 మంది సెల్ఫీ మరణాలు సంభవించాయని గుర్తించారు. భారత్లో సెల్ఫీ తీసుకుంటూ 76 మంది మరణించారు. పాకిస్థాన్లో 9 మంది, అమెరికాలో 8 మంది, రష్యాలో ఆరుగురు ఇలాగే చనిపోయారు.
No comments: