pop

మోడీ నిర్ణయంతో తిరుగుబాటు తప్పదు.. నోట్ల రద్దు దిక్కు మాలిన నిర్ణయం : కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు


ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న సంచలన నిర్ణయంతో దేశంలో తిరుగుబాటు తప్పదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. పెద్ద నోట్లను రద్దు చేయాలన్న ప్రధాని నిర్ణయాన్ని ఓ దిక్కుమాలిన నిర్ణయమని, 30 యేళ్లు వెనక్కి వెళ్లే ప్రమాదం ఏర్పడిందని మండిపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... మోడీ సర్కారు నిర్ణయంపై ప్రజలు తిరుగుబాటు చేయనున్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన, ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు కనీసం రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి ఓ సమావేశం ఏర్పాటు చేసుండాలని తన మంత్రుల వద్ద అన్నట్టు సమాచారం. నోట్ల రద్దు, తదనంతర పరిస్థితుల నేపథ్యంలో పార్టీ నేతలు, ఉన్నతాధికారులతో చర్చిస్తున్న కేసీఆర్, తన అభిప్రాయాలను వారి ముందు కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. నోట్ల రద్దుతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారన్నారు. రోజువారీ నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు సైతం బ్యాంకుల ముందు రోజులు గడపాల్సిన పరిస్థితి వచ్చిందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీనిపై ఊరుకునే ప్రసక్తి లేదని, వివిధ మార్గాల్లో కేంద్రంపై ఒత్తిడిని పెంచాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో స్వయంగా ప్రధానిని కలిసి వాస్తవ పరిస్థితులను వివరించాలని ఆయన నిర్ణయించారని పార్టీ వర్గాలు తెలిపారు.

No comments:

Powered by Blogger.