రెండో తరగతి బుడ్డోడు పెద్ద సాహసమే చేశాడు
తిరుపతి: ఏడేళ్ల బుడతడు. ఓ కారుకు తాడు కట్టి పళ్లతో పట్టుకుని లాగేశాడు. రెండో తరగతి చదువుతున్న చిన్నోడు ఇంతటి సాహసం చేయడం అబ్బురపరిచింది. రేణిగుంటకు చెందిన శంకర్రెడ్డి కుమారుడు సుదర్శన్ సోమవారం రైల్వేస్టేషన్ ముఖద్వారం వద్ద ఈ విన్యాసంతో స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యపరిచాడు. చిన్నప్పటి నుంచే ఇంట్లో బరువైన వస్తువులను ఎత్తడం, మోయలేని వాటిని తాడుకట్టి లాగేవాడని శంకర్రెడ్డి చెప్పారు. ఆ ఆసక్తిని గమనించి తాను సైకిల్పై కూర్చొని తాడు కట్టి పళ్లతో లాగమంటే అవలీలగా లాగేశాడన్నారు. పళ్లు ఏమైనా దెబ్బతింటాయేమోనని డాక్టర్కు చూపించగా.. అలాంటిదేమీ లేదన్నారు. దీంతో అప్పట్నుంచి ఈ సాహసాలను మొదలుపెట్టామన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా తన కుమారుడు భవిష్యత్లో మరిన్ని సాహసాలు చేస్తాడన్నారు. దాతలెవరైనా ప్రోత్సహిస్తే మరింత ముందుకెళ్తామని చెప్పారు.
No comments: