pop

ప్రేమకు.. ప్రాణం


మనస్థాపంతో యువతి ఆత్మహత్య చేసుకుని ప్రాణం తీసుకున్న సంఘటన గుంటూరు నగర శివారు అడవితక్కెళ్లపాడు రాజీవ్‌గృహకల్పలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజీవ్‌గృహకల్పకు చెందిన అనూష (19)కు తల్లిదండ్రులు లేక పోవడంతో నాయనమ్మ మార్తమ్మతో కలసి జీవిస్తోంది. కొంత కాలం క్రితం చౌడవరం దాసరిపాలెంకు చెందిన ఆటో డ్రైవర్‌
ఆనంద్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో అతన్ని వివాహం చేసుకొని నిండు నూరేళ్లు కాపురం చేయాలని ఆశపడింది. కులాలు వేరుకావడంతో యువకుని తరఫున కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారు. అయితే 4 నెలల క్రితం ఇరువురూ రహస్యంగా వివాహం చేసుకొన్నారు. ఆమె తన వివాహం విషయాన్ని గోప్యంగా ఉంచింది. రెండు రోజుల క్రితం ఆనంద్‌ వివాహం చేసుకొన్న విషయం వారి కుటుంబ సభ్యులకు తెలిసింది. వారు ఆగ్రహానికి గురై .. మంగళవారం అనూష ఇంటికి వచ్చి..మావాడ్ని మోసం చేసి వివాహం చేసుకొంటావా అంటూ ఆమెపై దాడికి పాల్పడ్డారు. మరళా బుధవారం రాత్రి కుటుంబ సభ్యులుతో పాటుగా కొందరు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి ఆమెపై దౌర్జన్యం చేశారు. మావాడ్ని మోసగించి వివాహం చేసుకొన్నావంటూ దుర్భాషలాడారు. అడ్డుగా వెళ్లిన భర్త ఆనంద్‌తో పాటుగా నాయనమ్మపై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. అందరూ చూస్తుండగానే ఇంటిలోకి వెళ్లి గడియ వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్ది సేపటికి భర్త ఆనంద్‌ తలుపు తీయమని కోరగా ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. బలవంతంగా తలుపులు తీయగా ఆమె ఉరేసుకొని వ్రేలాడుతూ కనిపించింది. వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్థారించారు. మృతురాలు నాయనమ్మ ఫిర్యాదుతో సీఐ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్సై అమీర్‌ తెలిపారు. మృతదేహానికి పంచనామా నిర్వహించడం కోసం శవాగారంలో దాచినట్లు ఆయన సూచించారు.

No comments:

Powered by Blogger.