రూ. 500లకు చిల్లర కోసం...
రూ. 500లకు చిల్లర ఇవ్వలేదన్న కారణంగా స్థానిక ఐఓసీ పెట్రోలు బంకు సిబ్బందిపై నలుగురు యువకులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పోలీసు స్టేషనులో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి ఎస్సై కె.విజయ్బాబు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇక్కడి ఐఓసీ పెట్రోలు బంకు (శ్రీసత్యదేవ ఫిల్లింగ్ స్టేషను)లో ఒక యువకుడు రూ. 100లకు పెట్రోలు పోయించుకొని రూ. 500ల పాత నోటు ఇచ్చాడు. చిల్లర విషయంలో బంకు సిబ్బందికి, వినియోగదారునికి వివాదం జరిగింది. దీంతో పెట్రోలు పోయించుకున్న యువకుడు తన స్నేహితులకు ఫోను చేసి రప్పించి, వారితో కలిసి బంకు సిబ్బందితో ఘర్షణకు దిగాడు. తర్వాత బంకు సిబ్బందికి రూ.100లు చిల్లర ఇచ్చి రూ. 500ల నోటు తీసుకొని వెళ్లిపోయారు. ఈ సంఘటనతో బంకు సిబ్బందిపై కక్ష పెట్టుకున్న ఆ యువకులు బుధవారం రాత్రి ద్విచక్రవాహనంపై వచ్చి బీరు సీసాను సిబ్బందిపై విసిరి కొట్టి పారిపోయారు. ఈ సంఘటనలో సిబ్బందిలోని శివకోటి దీనబాబుకు గాయమైంది. దీనిపై బంకు మేనేజరు యాళ్ల రత్నకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురు యువకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయ్బాబు తెలిపారు. రాజోలు సీఐ కిస్టోఫర్, మలికిపురం ఎస్సై విజయ్బాబు గురువారం ఘటనా స్థలిని పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బంకు వద్ద జరిగిన ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీని పరిశీలించామని, నిందితులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
No comments: